Monday, November 06, 2006

కార్తీక సోమవారము
ఈ రోజు కార్తీక సోమవారము. ఏదో ఈ కొరియాలో నాకు తోచిన వుపవాసము వుండి, సాయంత్రం స్నానం చేసి ఓ సారి నమకంలో ఒక మూడు అనువాకాలు చదివి, వండుకుని తింటిని. అసలు ఇది ఏముంది గాని అసలు ఇవాళ ఈ బ్లాగు వ్రాయడానికి వేరే కారణం వుంది. నాకు ఎప్పుడైనా కార్తీకమాసం అనగానే గుర్తుకువచ్చేది నా చిన్నతనంలోని మా కొవ్వూరు. పశ్చిమగోదావరిజిల్లా అంచున గోదావరి తీరంలో వుంది ఈ వూరు. గోదావరి తీరాన ఇటు కొ్వ్వూరు నుంచి చూస్తే అటుప్రక్కన కనిపించి కనిపించనట్టుగా, ఎత్తైన కాగితాల ఫ్యాక్టరీ పొగ గొట్టాలతో గోదావరి తీరాన అలనాటి రాజరాజనరేంద్రుని కాలము నుండి కూడా నేనే రారాజును అన్నఠీవితో కనబడుతుంది, ప్రస్తుతము రాజమండ్రి అనబడే ఆ తూర్పుగోదావరిజిల్లా తీర పట్టణము.

నేను హైస్కూలు చదివే రోజులలో, ఎనిమిదవతరగతిలో వుండగా ఉపనయనము జరిగింది నాకు. అటుతరువాత వచ్చిన కార్తీకమాసంలో ఒక సోమవారము గుళ్ళో జరిగే అభిషేకానికి నాతోసహా మా నాన్నగారు పేరు నమోదు చేసుకున్నారు. ఈ ఊళ్ళో చాలా కష్టము సుమండి ముందుగా చేసుకోకపోతే, ఎందుకంటే వూరిలో చాలామందే వున్నారు బ్రాహ్మణులు. సరే పొద్దున్నే గోదావరి స్నానంతో మొదలు పూజా కార్యక్రమం! ఆహా ఆ అఖండ గోదావరి స్నానంలో వున్న ఆనందమే వేరు. తరువాత గుళ్ళో అభిషేకంతో అసలు పూజ మొదలు. నిజంగా ఆ వయస్సులో గర్భగుడిలో కూర్చుని అభషేకం చెయ్యడం, అదీ గుడిలోని శివలింగానికి నేరుగా, మొదట గర్వంగా అనిపించినా, ఆ పూజ పూర్తిఅయ్యేసరికి నాకు కైలాసంలోని ప్రమథ గణాలన్నీ కనబడినాయి మిట్టమధ్యహ్నం అయ్యేసరికి. సరే అప్పుడు ఇంక అందరికీ ఏదో పిండి (మన ఉప్మాలాంటిది) పెట్టారు. ఏదో మోహమాటపడుతూ సగం కడుపువరకు లాగించాను అనుకోండి అది కూడా! అప్పుడు ఇంక అదేదో లక్ష బిల్వార్చన అని మొదలు పెట్టారు. సరే అది పూర్తయ్యే సరికి సాయంత్రం అయ్యింది. హమ్మయ్య అయిపొయ్యిందిరా పరమేశ్వరా అనుకోగానే, మాళ్ళా అమ్మవారికి ఏదో పూజ. దానికి అమ్మ, అక్క కూడా వచ్చారు. బహుశా లలితాసహస్రం ఏమో, బాలాత్రిపురసుందరీ దేవికి. సరే అదీ అయ్యింది ఏడుగంటల వాల్టికి. ఏమాట కామాటే చెప్పుకోవాలిగాని ఆ గుళ్ళో వున్న అనుభూతి, ఆ ప్రకృతి రమణీయత ఎక్కడా కబడవు. సాయంత్రం నది మీదనుంచి వీచే వణికించే చల్లని మెల్లని గాలి, ఆ సమయానికి వూళ్ళోని అయ్యప్ప స్వాముల సాయంస్నానాల కోలాహలం, కుటుంబాలతో సహా తరలివచ్చే వూరిజనాల వుత్సాహము, గోదావరి నదిని చూసి మురిసిపొయ్యే చిన్నపిల్లల వికసించిన మోహాలు, అ జనాల మోహాలకు పోటీగా అన్నట్లుగా గుడి దారిలో దేదీప్యమానంగా వెలిగే మెర్క్యురి లైట్లు, విశాలమైన గుడి ప్రాంగణం ఇప్పటికీ తలచుకుంటే కలానిజమా అన్నట్లు వుంటుంది.

సరే గుడిని వదిలిపెట్టితే ఇంక అభిషేకము తరువాత ఆ సాయంత్రం ఎవరి ఇంటిలోనో ఆ రోజు గుడిలో పూజ, అభిషేకము చేసుకున్న బ్రాహ్మణులందరికీ భోజనాలుట. ఆహా అన్ని వంటలు, అదీ ఆ గోదావరి జిల్లాల ప్రత్యేకత ఐన ఆవపెట్టి చేసే పద్ధతిలో రుచిగా వండి, మడికట్టుకోని వడ్డించే మనుషులు వడ్డిస్తూ వుంటే, అసలే భోజనప్రియుడనైన నేను ఒళ్ళు తెలియకుండా తినేశా! ఇంకేముంది తిన్నాక ఒంటికంటే పొట్ట బరువైపొయ్యే! ఇక అంతే వాళ్ళ వాకిట్లోనే చతికిలబడ్డా! మా నాన్నగారు కొద్దిగా మందలించినట్టుగా కూడా గుర్తు, అంత ఒళ్ళు పై తెలియకుండా తింటే ఎలా అని. అదీగాక ఇంట్లో ఎన్నడు విస్తరిలో పదార్థాలు వదలకుండా తినడం అలవాటు .ఎక్కువైనాసరే! ఇంకా బయటవాళ్ళు అనేసరికి వాళ్ళు కొసరి కొసరి వడ్డించడం, నేను మోహమాటపడి ఎక్కువ తినెయ్యడం రెండూను. ఇంకేముంది వూపిరిపీల్చడం కాడా కష్టమైపొయ్యింది. నన్ను చూసి మా అమ్మ హడావుడి పడడం, వూళ్ళోవాళ్ళ వుచిత సలహాలు, మా నాన్నగారు నన్ను అక్కడే కొచెంసేపు కూర్చుండబెట్టి, కొంత భుక్తాయాసం తీరిన తరువాత నన్ను నెమ్మదిగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మా ఇంటికి నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. రిక్షా ఎక్కించలేదని ఓ రెండుసార్లు నేను మా నాన్నని తిట్టుకోని వుండే వుంటాను కూడా! ఎలాగైతేనేమి ఇంటికి వెళ్ళేసరికి మామూలు మనషినయ్యా! ఇప్పటికి నాకు మా నాన్నగారి చిట్కాలు, ఆయన సమయోచిత నిర్ణయాలు చాలా వరకు అప్పట్లో అర్థంకాకున్నా, తిట్టుకున్నా, ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఎంత సరియైన నిర్ణయాలు చేసేవారో అర్థమవుతుంది.

అదండీ మరి నా కార్తీకసోమవారం కథ. :-)

Wednesday, November 01, 2006

పోతన భాగవతము

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞీయమున్ సుందరో
జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు వుర్విన్ సద్విజ శ్రేయమై.


ఇక్కడ మహాభాగవతాన్ని కల్పవృక్షంతో పోల్చి చూపిస్తున్నాడు పోతన మహాకవి. లలిత స్కంధము అంటే మనోహరమైన విభాగాలు కలది అని భాగవతపరంగా అలాగే వృక్షపరంగా లలితనైన స్కంధములు కలది అని. విశేషణాలు వుభయాన్వయంగా, అటు మహాభారతానికి యిటు కల్పవృక్షానికి కూడా పొందుపరచడం జరిగింది. కృష్ణ మూలము, ధృఢమైన మూలము వృక్షపరంగా, శ్రీకృష్ణ పరమాత్ముడే మూలము యిందులో భాగవతపరంగా! శుకాలాపాభిరామంబు, శుకపిక పక్షుల కలకలారావములతో మధురంగావున్నదిట వృక్షము, ఐతే శుకమహర్షి ఆలాపంచేత, ఆయన చెప్పటం చేత ఇది మధుర మధురాయమానము అంటున్నాడు మహాభాగవతపరంగా! మంజులతాశోభితమున్, మంజులత్వముచేత శోభించేది మహభాగవతము, మనోహరమైనటువంటి తీగల చేత అల్లుకొన్నది కల్పవృక్షము. సువర్ణసుమనస్సుజ్ఞీయమున్, సువర్ణములు అనగా మంచి అక్షరములు కలది మహాభాగవతము, సుమనస్సులు అంటే దేవతలు. దేవతలకు కూడా తెలుసుకోదగినదిగా వున్నది మహాభాగవతము. కల్పవృక్షపరంగా, మంచి రంగులు కలిగి, సుమనస్సులు అంటే, మంచి పుష్పములతో అలరారుతున్నది అని అర్థము. సుందరోజ్వలవృత్తము, సుందరమైన ఉజ్వలమైన వృత్తాంతము కలది శ్రీమహాభాగవతము, సుందర వుజ్వలమైన వృత్తము అనగా చుట్టుకొలత కలది ఆ కల్పవృక్షము. మహాఫలంబు, మోక్షమే ముక్తియే ఫలంగా కలది ఈ మహాభాగవతము, ఐతే మహాఫలములతో శోభిల్లుచున్నది కల్పవృక్షము. విమల వ్యాసాలవాలంబునై, విమలమైన విస్తారమైన వ్యాసమైన ఆలవాలము కలిగినటువంటిది ఆ కల్పవృక్షము, ఐతే మహాభాగవతము వ్యాసుడే పవిత్రమైనటువంటి మనస్సుతో వ్యాసుడే ఆలవాలముగా మూలముగా కల్గినటువంటిది ఇది. వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు, భాగవతము అనే పేరుగల ఈ కల్పవృక్షము శోభిల్లుగాక! ఉర్విన్ సద్విజశ్రేయమై, ద్విజములు అంటే పక్షులు, కల్పవృక్షము పక్షులకు సమాశ్రయముగా వున్నదిట, సద్విజః అంటే వేదాంతులు, విజ్ఞానవేత్తలు, బ్రాహ్మణులు, విద్వాంసులైన వారికి, ఎవరైతే మోక్షార్థులై వున్నారో, మోక్ష సంకల్పార్థులై వున్నారో అటువంటివారికి శ్రేయోదాయకమై, మోక్షఫలప్రదాయకమై ఈ మహాభాగవతం వెలయు చున్నది అన్నాడు. ఇదీ లలిత స్కంధము కృష్ణమూలము ఐన మహాభాగవత కల్పవృక్షము.

ఆహా! ఎంత సుమధురమో గదా అ పోతనగారి భాగవతము.

ఈ వ్యాఖ్యానము www.teluguone.com/bhakti లో నాగఫణిశర్మగారిచే చేయబడినది. చాలా బాగుంది ఆయన వ్యాఖ్యానము.